Competitive Special : బడ్జెట్ కథ ఇదే..  లోటు బడ్జెట్ గురించి మీకు తెలుసా?​

Competitive Special : బడ్జెట్ కథ ఇదే..  లోటు బడ్జెట్ గురించి మీకు తెలుసా?​

బడ్జెట్​ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక. వచ్చే సంవత్సరంలో ప్రభుత్వం అమలుచేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్​ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు చెల్లింపులు సంబంధిత పరిమాణాత్మక విలువలను తెలియజేస్తుంది. రాబోయే సంవత్సరంలో చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. దేశంలో కేంద్ర బడ్జెట్​ను కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్​ను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తాయి.

కేంద్రపాలిత ప్రాంతాల బడ్జెట్​ వ్యవహారం కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. భారతదేశ బడ్జెట్​ ముసాయిదా వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు సమర్పిస్తుంది. సాధారణంగా బడ్జెట్​ను ఫిబ్రవరి నెల చివరి రోజున సమర్పిస్తారు. దానికి ముందురోజు ఆర్థిక సర్వే, దాని ముందురోజు రైల్వే బడ్జెట్​ను సమర్పించేవారు. 2017 నుంచి బడ్జెట్​ను ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టి, మార్చిలో చర్చించి మార్పులు చేసి పార్లమెంట్​ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి తీసుకువస్తున్నారు. 2017–18 బడ్జెట్​ను ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ మొదటగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు.  

మన దేశంలో సాధారణ బడ్జెట్​ నుంచి రైల్వే బడ్జెట్​ను వేరు చేయమని అక్వర్త్​ కమిటీ 1921లో సూచించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్​ను వేరు చేసి చూపారు. బిబేక్​ దేబ్రాయ్​ కమిటీ సిఫారసులపై 2016 , సెప్టెంబర్​లో రైల్వే బడ్జెట్​ను సాధారణ బడ్జెట్​తో కలిపేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఫలితంగా 2017–18 బడ్జెట్​ నుంచి రైల్వే బడ్జెట్​, సాధారణ బడ్జెట్​తో కలిపి చూపుతున్నారు.

బ్రిటీష్​ పాలనలో భారత దేశ తొలి బడ్జెట్​ను జేమ్స్​ విల్సన్​ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​.కె.షణ్ముఖం చెట్టి ఆదాయం 171 కోట్లు, ఖర్చు 194 కోట్లతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. గణతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్​ను జాన్​ మథాయ్​ ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఎక్కువ సార్లు బడ్జెట్​ను మొరార్జీ దేశాయ్​ (10 బడ్జెట్లు) ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పి.చిదంబరం తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. బడ్జెట్​ను ప్రవేశ పెట్టిన తొలి ప్రధాని నెహ్రూ. బడ్జెట్​ను ప్రవేశ పెట్టిన మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. ప్రధానిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా బడ్జెట్​ను నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ ప్రవేశపెట్టారు. 

కేంద్ర ప్రభుత్వ రాబడి, వ్యయాలు, రుణాలు పలు రకాల లోట్లు, ఇతర ద్రవ్య ప్రవాహాలను ప్రదర్శించే పట్టికనే వార్షిక బడ్జెట్​ అంటారు. ఇది ప్రభుత్వ వార్షిక ప్రణాళిక అంశాలను, విధానాలను తెలియజేస్తుంది. భారతదేశ బడ్జెట్​, రాబోయే సంవత్సరానికి అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ రాబడులు, చెల్లింపులను మూడు ఖాతాలుగా చూపుతుంది. 

సంఘటిత నిధి: ఆర్టికల్​ 266 ప్రకారం పన్నులు, సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని రకాల ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఈ నిధికి జమ అవుతాయి. ప్రభుత్వ వ్యయం నిమిత్తం డబ్బు తీసుకోవాలంటే పార్లమెంట్​ అనుమతి తప్పనిసరి. సంఘటిత నిధికి చెందిన ఈ భాగాన్నే సాధారణ బడ్జెట్​ అంటారు. అదే విధంగా రాష్ట్ర రాబడులన్నీ రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి. 

కంటింజెన్సీ నిధి ఖాతా: పార్లమెంట్​ సమావేశాలు లేనప్పుడు కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం వ్యయం చేయాల్సి వస్తుంది. తుపాన్లు, వరదలు, భూకంపాలు తదితర అత్యవసర సమయాల్లో పార్లమెంట్​ ఆమోదం తర్వాత పొందవచ్చని రాష్ట్రపతి ఆధీనంలోని కంటింజెన్సీ నిధి నుంచి ప్రభుత్వం వ్యయం చేయవచ్చు. అయితే, తర్వాత పార్లమెంట్​ ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం కంటింజెన్సీ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని తిరిగి కంటింజెన్సీ నిధిలో జమ చేయాలి. 

అంచనా రాబడులు: ఇవి అన్ని మార్గాల నుంచి ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో వసూలు చేయాలని అంచనా వేసిన రాబడులు. ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వం వసూలు చేసిన వివిధ రకాల పన్నుల రాబడి ఆధారంగా రాబోయే సంవత్సర రాబడి అంచనాలు తయారు చేస్తారు. అంటే ఈ రాబడి విషయాలన్ని భారతదేశ పన్నుల విధానానికి సంబంధించినవి. 

అంచనా వ్యయం: ఇది రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళిక, పథకాల అమలుపై చేయడానికి అంచనా వేసిన ఖర్చు. ప్రస్తుత సంవత్సరం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై చేసిన ఖర్చు ఆధారంగా వచ్చే సంవత్సర వ్యయ అంచనాలు తయారు చేస్తారు. అంటే ఈ వ్యయం వివరాలన్నీ భారతదేశ వ్యయ విధానానికి సంబంధించినవి. 

ప్రభుత్వ ఖాతా : ప్రభుత్వ ఖాతాలో భారత ప్రభుత్వ రాబడి వ్యయాల గణాంకాలతోపాటు ఇతర లావాదేవీలు కూడా చేరి ఉంటాయి. అలాంటి లావాదేవీల్లో ఉద్యోగుల ప్రావిడెంట్​ ఫండ్​, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు, పీఎఫ్​, తపాలా, జీవత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఈ మొత్తాలను వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మినహా ఈ లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం పార్లమెంట్​ ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. దీన్నుంచి ఖర్చు చేసేటప్పుడు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. బడ్జెట్​లో మొత్తం రాబడి, మొత్తం వ్యయం సమానంగా ఉంటే అది సమతౌల్య బడ్జెట్​, రాబడి కంటే వ్యయం అధికమైతే అది లోటు బడ్జెట్​, వ్యయం కంటే రాబడి అధికమైతే అది మిగులు బడ్జెట్​. బడ్జెట్​లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అంచనా వేసిన రాబడులు, అంచనా వేసిన వ్యయం. 

బడ్జెట్​లోని భాగాలు 

రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయ ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​ను రెండు ఖాతాలుగా వర్గీకరించారు. అవి.. 1. రెవెన్యూ ఖాతా 2. మూలధన ఖాతా. 
రెవెన్యూ ఖాతా: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే ప్రభుత్వ లావాదేవీలన్నీ రెవెన్యూ బడ్జెట్​లో చూపుతారు. రెవెన్యూ బడ్జెట్​లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం భాగాలుగా ఉంటాయి. 
ఎ. రెవెన్యూ రసీదులు: పన్ను రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది. 

పన్నుల రాబడి :  కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పన్నులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్ను రాబడి అంటారు.

పన్నేతర రాబడి: కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా లభించే రాబడి పన్నేతర రాబడి అంటారు. 

రెవెన్యూ వ్యయం: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపటానికి చేసే వ్యయం. రెవన్యూ వ్యయం వల్ల దేశంలో ఎలాంటి ఆస్తి సృష్టి జరగదు. రెవన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటుగా వర్ణిస్తారు. 

మూలధన బడ్జెట్​: కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు  ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దాన్ని మూలధన బడ్జెట్​ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని పరిధిలోకి వస్తాయి. దీనిలో మూలధన రాబడులు, మూలధన వ్యయం భాగాలుగా ఉంటాయి. 

మూలధన రాబడులు:

కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తం మూలధన బడ్జెట్​ రాబడిగా చెప్పవచ్చు. ఇవి రెండు రకాలు.

1. మార్కెట్​ నుంచి తీసుకునే రుణాలు: ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన రుణాలు (మార్కెట్​ రుణాలు), చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్​ ఫండ్​ మొత్తాలు, ట్రెజరీ బిల్లుల రూపంలో రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే రుణం. విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి సేకరించే రుణాలు. ఈ రెండింటిలో మార్కెట్​ నుంచి తీసుకునే రుణాలే అధికంగా ఉంటాయి. 

2. రుణేతర రాబడులు: రుణేతర రాబడుల్లో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, గతంలో ప్రభుత్వమిచ్చిన రుణాలను వెనక్కి తీసుకోవడం ద్వారా రాబడిని సమకూర్చుకుంటారు. 

మూలధన వ్యయం: ప్రభుత్వ ఆస్తులను సృష్టించి, వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయం మూలధన వ్యయం అంటారు. జాతీయ ప్రాజెక్టు, పరిశ్రమలపై చేసే వ్యయం ఈ వర్గానికి చెందుతుంది.

లోటు బడ్జెట్

అభివృద్ధి పనులపై చేసే వ్యయం కంటే ప్రభుత్వం సేకరించే రాబడి వనరులు తక్కువగా ఉన్నప్పుడు లోటు ఏర్పడుతుంది. దీనికోసం ప్రభుత్వం వనరులను పలు మార్గాల నుంచి సేకరిస్తుంది. అవి మార్కెట్​ రుణాలు, రిజర్వ్​ బ్యాంక్​ వద్ద దాచిన ప్రభుత్వ నిల్వలు వాడటం, రిజర్వు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం. ఈ విధంగా లోటు ద్రవ్యాన్ని భర్తీ చేయడం 1970 తర్వాత ప్రభుత్వానికి అలవాటుగా మారింది. బడ్జెట్​లో ఆదాయానికి మించిన లోటు ఏర్పడుతుంది. వివిధ రకాలు లోటులు. అవి.. రెవెన్యూ లోటు, బడ్జెట్​ లోటు, కోశలోటు, ద్రవ్యీకరించబడిన లోటు, ప్రాథమిక లోటు. 

రెవెన్యూ లోటు: రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైతే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. రెవెన్యూ లోటును మూలధన ఖాతా ద్వారా భర్తీ చేస్తారు. 
రెవెన్యూ లోటు = రెవెన్యూ వ్యయం – రెవెన్యూ రాబడి
బడ్జెట్​ లోటు: మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువైతే బడ్జెట్​ లోటు ఏర్పడుతుంది. బడ్జెట్​ లోటును నూతన కరెన్సీ నోట్ల జారీ ద్వారా భర్తీ చేస్తారు. 
బడ్జెట్​ లోటు = మొత్తం వ్యయం – మొత్తం రాబడులు
కోశలోటు: బడ్జెట్​ లోటులోని లోపాన్ని తొలిసారి షెనాయ్​, ఆ తర్వాత సుఖ్​మాయ్​ చక్రవర్తి ప్రస్తావించారు. బడ్జెట్​ లోటును గణించేందుకు మూలధన రాబడుల్లో మార్కెట్​ రుణాలు కలిపి చూపడమైంది. చక్రవర్తి కమిటీ ఈ మార్కెట్​ రుణాలను మూలధన రాబడుల్లో చూపొద్దని, ఫలితంగా బడ్జెట్​ లోటు మార్కెట్​ రుణాల ద్వారా భర్తీ చేసుకోవడానికి వీలుకాదని ప్రకటించారు.

కాబట్టి మూలధన రాబడుల నుంచి మార్కెట్​ నుంచి మార్కెట్​ రుణాలు మినహాయించి కోశలోటును గణించవచ్చు. రాబడి ఖాతాలో చూపిన ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులు ప్రభుత్వ రాబడి కావు. ఈ మేరకు రాబడి లోటు ఉన్నట్లే. అందువల్ల బడ్జెట్​ల లోటుకు ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులు కలిపితే కోశలోటు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ సమగ్రమైన లోటు కొలమానం ఇదే. 1997–98 నుంచి ఈ లోటు గణిస్తున్నారు. దీన్ని కొత్త రుణాలు తీసుకోవడం లేదా నూతన కరెన్సీ ముద్రణ ద్వారా భర్తీ చేయవచ్చు. 

కోశలోటు = బడ్జెట్​ + మార్కెట్​ రుణాలు 

ద్రవ్యీకరించబడిన లోటు: నూతన కరెన్సీ ముద్రించడం ద్వారా భర్తీ చేసే లోటును ద్రవ్యీకరించబడిన లోటు అంటారు. దీనివల్ల ద్రవ్య సప్లయ్​ పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 
ప్రాథమిక లోటు: కోశలోటుకీ వడ్డీ చెల్లింపులకీ మధ్య వ్యత్యాసమే ప్రాథమిక లోటు. ప్రభుత్వ రుణంలో వడ్డీ చెల్లింపులు పోగా ఎంత మొత్తం ప్రస్తుత వ్యయానికి అందుబాటులో ఉంటుందో తెలియజేసే దానిని ప్రాథమిక లోటు అంటారు. 
లోటు బడ్జెట్​ను భర్తీ చేసేందుకు అదనపు కరెన్సీ ముద్రణ, రుణాల స్వీకరణ, అదనపు పన్నులు విధించడం తదితర చర్యలు చేపడుతారు. 1997కు పూర్వం లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం ఆర్​బీఐ వద్ద ఓవర్​డ్రాఫ్ట్​ సదుపాయం వినియోగించేది. దీనివల్ల ప్రభుత్వం విచ్చలవిడిగా రుణం వాడేది. 1997 నుంచి ఆర్జనోపాయ సదుపాయం కింద తాత్కాలిక రుణాలు తీసుకునే సదుపాయం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాత రుణం తీర్చినప్పుడే కొత్త రుణం ఇస్తారు.